కర్నూలు జిల్లా వింత ఆచారాలకు వింత పద్ధతులకు నిలయం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక ఊరిలో వింత ఆచారాలు ఉంటూనే ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటే, కొన్ని సంప్రదాయంగా ఉంటాయి. ఇంకొన్ని ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి వింత ఆచారాన్ని చూడబోతున్నాం. దీన్ని నమ్మకం అనాలో, మూఢనమ్మకం అనాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ ఊరి వాళ్లు పాటించే ఆచారం అలాంటిదే. పిల్లలతో సహా కొందరు పెద్దవాళ్లు నేలపై పడుకుంటారు. వారిపై నుంచి గోవింద అని అరుస్తూ అనేకమంది పరుగులు పెడతారు. పరిగెత్తే వారి అరుపులతో అక్కడి పిల్లలు భయబ్రాంతులకు గురవుతారు. అయితే మిగిలినవారికి ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం. ఏడుస్తున్న చిన్నారుల కష్టాన్ని పట్టించుకునేవారు ఉండరు. చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా నేలపై బొక్కబోర్లా పడుకుంటారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం కాలనిలోని శ్రీ గుంటిరంగా స్వామి ఆలయంలో ఈ సందడి జరుగుతుంది.
ప్రతి శ్రావణ శనివారానికి ముందు రోజు శుక్రవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యే ఈ ఆచారంలో వేలాది మంది పాల్గొంటారు. వాళ్లు కత్తులు, కర్రలు, వ్యవసాయ పనిముట్లు పట్టుకుని గంగవరం తుంగభద్ర నదికి 40 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి అక్కడి నీటిని తెస్తారు. ఆ నీటితో స్వామికి జలాభిషేకం చేస్తారు. ఆ సమయంలో ఆయుధాలు పట్టుకొని గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తారు. గుడి చుట్టూ పడుకున్న వారి మీదుగా భక్తులు దాటి వెళ్లితే శారీరక, మానసిక బాధలు తగ్గుతాయని నమ్మకం. అలాగే వానలు పడతాయని, పంటలు బాగా పండతాయని విశ్వసిస్తారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి వేలాది మంది తరలివస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..