ఒకప్పుడు ఇళ్లలో చొరబడి బంగారం, నగదు లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయారు. కానీ సీసీ కెమెరాలు, పోలీసు పహరాలు, టెక్నాలజీ కారణంగా వారు ఈజీగా దొరికిపోతున్నారు. దీంతో దొంగలు సైతం ఒరిజినల్ ఐడియాలో వెతుకుతున్నారు. పశువులను లక్ష్యంగా ఇప్పుడు దొంగతనాలు పెరిగాయి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామం రోడ్డుపై ఓ వినూత్న దొంగతన యత్నం చోటుచేసుకుంది.
గ్రామ శివారులో ఆవులను మేస్తున్న ఓ రైతు వాటిని అక్కడే కట్టి కొద్దిసేపటికి పక్కకి వెళ్లాడు. అదే సమయంలో దొంగలు వచ్చి ఆవులపై కన్నేశారు. ఆ పశువులను నేరుగా ఎత్తుకెళ్లటం సాధ్యం కాదని భావించిన దొంగలు, వాటికి మత్తుమందు ఇచ్చి అపహరించడానికి ప్రయత్నించారు. మత్తుమందు తిన్న ఆవులు గంటలకొద్దీ అక్కడే కదలకుండా ఉండిపోవడంతో.. గ్రామస్తులు వెంటనే పశువుల వైద్యుడిని పిలిచి చికిత్స అందించారు. దాదాపు 8 గంటల పాటు అవి అచేతనంగా ఉన్నాయని వారు తెలిపారు.
ఇలాగే మత్తుమందు ఇచ్చి పశువులను దొంగిలించాలన్న ప్రయత్నం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి అని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల పశువుల ధరలు పెరగడంతో వాటిని దొంగిలించి వెంటనే అమ్మేయవచ్చన్న ఆలోచన దొంగల్లో కనిపిస్తున్నట్లు పోలీసులు కూడా చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పశువుల దొంగతనాలు కూడా ఓ కొత్త ముఠా మాదిరిగా వ్యవహరిస్తున్నాయన్న అనుమానం వ్యక్తమవుతోంది.
ఈ ఘటన తర్వాత గ్రామస్థులు తమ పశువులపై మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.