హైదరాబాద్లో ఫైనాన్షియర్ సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ కుమార్ అహుజా పై మోకిలా పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. ఫరీద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫరీద్ అనే వ్యక్తి సునీల్ కుమార్ అహుజా దగ్గర రూ. 17 కోట్లు లోన్ తీసుకున్నాడు. లోన్ ఇచ్చేటపుడు ఫరీద్ నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ పత్రాలు సెక్యూరిటీ గా తీసుకున్నాడు సునీల్ అహుజా. మోకిలా, శంకర్ పల్లిలో ఖరీదైన ల్యాండ్ పత్రాలు సెక్యూరిటిగా పెట్టాడు ఫరీద్. రూ.17 కోట్లకు వడ్డీతో కలిపి సునీల్ అహుజాకు రూ. 22 కోట్లు చెల్లించాడు ఫరీద్. అయినా సరే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా కబ్జా చేశారు సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ కుమార్ అహుజా. అంతటితో ఆగకుండా ఈ ల్యాండ్ తమదేనని అహుజా తండ్రి కొడుకులిద్దరు తనను బెదిరిస్తున్నారని బాధితుడు ఫరీద్ మోకిలా పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ అహుజా పై కేసు నమోదు చేశారు.
5ఏళ్ల క్రితం భారతి బిల్డర్స్ ప్రాజెక్ట్ ప్రారంభం
ఇదే సునీల్ అహుజా భారతి బిల్డర్స్ వ్యవహారంలోను ఇదే రీతిలో కబ్జా చేశాడు. భారతి బిల్డర్స్ వ్యవహారంలో బాధితులు 500 మంది వరకు ఉన్నారు. భారతి బిల్డర్స్ పేరుతో చలామణి అయిన ప్రీ లాంచ్ ప్రాజెక్ట్కు కోట్ల రూపాయలు చెల్లింపులు చేశామని 250 బాధితులు రోడ్డెక్కారు. 5 సంవత్సరాల కిందట భారతి బిల్డర్స్ ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది. భారతి బిల్డర్స్ కనీసం 25 శాతం పనులు కూడా చేయలేదు. సాకులు చెబుతూ భారతి బిల్డర్స్ బాధితులను మోసం చేస్తూ వచ్చింది. అనూహ్యంగా సునీల్ అహుజా అనే వ్యక్తికి ల్యాండ్ అమ్మేసి…. ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు డబ్బులు కట్టిన పబ్లిక్ను భారతి బిల్డర్స్ నిండా ముంచేసింది. ఇదేంటని భారతి బిల్డర్స్ను బాధితులు ప్రశ్నించగా.. భారతి బిల్డర్స్, సునీల్ అహుజా బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. భారతి బిల్డర్స్ను నిలదీస్తే… కొందరికి చెక్కులు ఇచ్చి పంపించారు. అయితే ఆ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి.
పైసా పైసా కూడబెట్టుకొని పెట్టుబడి పెడితే… తమను నిండా ముంచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
బ్లాంక్ చెక్కులు, స్టాంపు పేపర్లపై సంతకాలు
భారతి బిల్డర్స్నే కాదు… పలు నిర్మాణ సంస్థల వ్యవహారాల్లోనూ వీరు బాధితులను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. అవసరానికి ఆదుకుంటున్నామంటూ బాధితుల నుంచి బ్లాంక్ చెక్కులు, స్టాంపు పేపర్లపై సంతకాలు చేయించుకొని, వారి ఆస్తులను కాజేయడానికి ఈ తండ్రీకొడుకులు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, పోలీసు అధికారుల పేర్లు చెప్పి బాధితులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అంతేకాకుండా, తిరిగి చెల్లించే డబ్బులను హవాలా మార్గంలో స్వీకరిస్తున్నారని సమాచారం. సునీల్ అహుజా, ఆశిష్ అహుజా వేధింపులు తాళలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..