
హైదరాబాద్, జులై 27: జవాబుపత్రాలు దిద్దడంలో ఓ ప్రొఫెసర్ చేసిన తప్పిదం ఏకంగా 138 విద్యార్ధులు సెకండ్ సెమిస్టర్ పరీక్షలో ఫెయిలయ్యారు. మూడు కాలేజీలకు చెందిన ఈ విద్యార్థులంతా ఒకటే సబ్జెక్టులో ఫెయిల్ అవడంతో అంతా అయోమయంలో పడిపోయారు. చిరవకు ఓ విద్యార్థి ద్వారా అసలు సంగతి తెలుసుకుని నాలుక కరచుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ పరిధిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని నాలుగో ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలు గత నెలలో జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు జులై 17న ప్రకటించారు. చివరి ఏడాదిలో క్రెడిట్ బేస్డ్ సబ్జెక్టు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) ఉంటుంది. అయితే ఈ సబ్జెక్టులో శ్రీదత్త, మల్లారెడ్డి, షాదన్ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన దాదాపు 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఒక్క ఈఐఏ సబ్జెక్టులోనే అధిక మంది ఫెయిల్ అయినట్లు గుర్తించిన శ్రీదత్త కాలేజీకి చెందిన ఓ విద్యార్ధి.. అసలు ఆ సబ్జెక్టులో షెయిలయ్యే అవకాశంలేదని మరోసారి ఫలితాలను చెక్ చేయాలని కోరుతూ జేఎన్టీయూ పరీక్షల విభాగం అధికారులకు మెయిల్ చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఒకే సబ్జెక్టులో 138 మంది ఫెయిల్ అయ్యారని గుర్తించి, వారి జవాబు పత్రాలను పరిశీలించగా అసలు తప్పిదం ఆ పేపర్లు దిద్దిన ప్రొఫెసర్దిగా గుర్తించారు.
అసలు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) పరీక్ష ఒకే రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో ఇంజనీరింగ్ విద్యార్ధులకు నిర్వహించారు. అయితే ఈ పేపర్లు దిద్దిన ప్రొఫెసర్ మాత్రం ఉదయం ప్రశ్నపత్రంతోనే రెండు షిఫ్టుల జవాబు పత్రాలను దిద్దాడు. ఈ పొరబాటు గుర్తించిన వర్సిటీ అధికారులు సాయంత్రం క్వశ్చన్ పేపర్తో మళ్లీ వారందరి సమాధాన పత్రాలు దిద్దించగా.. ఈసారి ఆ విద్యార్ధులు అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు జరిగిన తప్పిదాన్ని సరిచేసి గురువారం (జులై 24) రాత్రి ఫలితాలను మరోమారు ప్రకటించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.