“ఇదేం జీవితం.. ఎటు చూసినా అవినీతి, కాలుష్యం..” అని సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. “ఇక జీవించాలనే ఆసక్తి లేదు.. ఎక్కడ చూసినా కరప్షన్, ఎటు తిప్పినా పొల్యూషన్.. అమ్మ నాన్న నన్ను క్షమించండి” అంటూ ఓ 26ఏళ్ల యువకుడు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా మొరంపూడికి చెందిన వేణుగోపాల్, తన అన్న దిలీప్ దంపతులతో కలిసి హైదరాబాద్ మణికొండ శిరిడి సాయి నగర్లో నివసించేవాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వేణు.. ఈనెల 23న అన్నావదినలతో కలిసి సొంతూరికి వెళ్లి.. అదే రోజున మళ్లీ హైదరాబాద్కు ఒక్కడే తిరిగి వచ్చాడు. కానీ 25వ తేదీ నుంచి అతడి ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పక్క ఇంట్లో ఉన్న వాచ్మెన్ సాయిబాబాకు ఫోన్ చేసి చూడమన్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా వేణుగోపాల్ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని మృతిచెందినట్లు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
గదిలో లభించిన సూసైడ్ నోట్లో వేణుగోపాల్ తన మృతి వెనక ప్రేమ, వ్యక్తిగత కారణాలేమీ లేవని పేర్కొన్నాడు. సమాజంలో ఉన్న అవినీతి, కాలుష్యం వల్లే జీవితం మీద విరక్తి వచ్చిందని వెల్లడించాడు. ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మీకు ఆత్మహత్య ఆలోచనలు ఉన్నా.. లేదా మీకు తెలిసినవారు ఆత్మహత్య ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నా.. రోహ్ని హెల్ప్లైన్ నంబర్ 081420 20033, లేదా స్నేహ ఫౌండేషన్ – 04424640050 హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించండి. వారు మీ వివరాలు గోప్యంగా ఉంచి.. మానసిన మద్దతు అందిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..